మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ అంటే దేశ వ్యాప్తంగా తెలియని వారుండరు. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. అయితే తాజాగా మరో సారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ప్రియా ప్రకాశ్కు లీగల్ నోటీసులు పంపడంతో ఇది సంచలనం కలిగిస్తోంది.
అసలు విషయానికి వస్తే…ముద్దుగుమ్మ తాజాగా ‘శ్రీదేవి బంగ్లా’ అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రియా ప్రకాశ్ స్టార్ శ్రీదేవి అనే టాప్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే ట్రైలర్, టైటిల్ని బట్టి చూస్తే ఇది దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
అయితే ట్రైలర్లో శ్రీదేవి బాత్టబ్లో పడి చనిపోయిన సీన్ కూడా ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాత బోనీ కపూర్.. ప్రియతో పాటు చిత్రబృందానికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై స్పందించారు చిత్ర నిర్మాత.
చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మాట్లాడుతూ.. ‘గత వారం బోనీ కపూర్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ప్రియా ప్రకాశ్ వారియర్కూడా స్పందించారు. ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్స్టార్ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు.