ఆంధ్రా ఆక్టోపస్.. పారిశ్రామిక వేత్త నుంచి రాజకీయ నేతగా మారిన లగడపాటి రాజగోపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తనకు చాలా అనుమానాలున్నాయని బాంబు పేల్చారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం హవా పెరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అసలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా గెలవకూడదని.. కానీ అలా జరగలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందని.. అందుకే ఓటింగ్ శాతం ఎంతో ప్రకటించడంలో కూడా ఈసీ ఆలస్యం చేసిందన్నారు. అంతేకాదు ఇక నుంచి తాను నిర్వహించే ఎన్నికల సర్వే.. పోలింగ్ ముందు విడుదల చేయనని.. ముగిసిన తర్వాతనే సర్వే బహిర్గతం చేస్తానన్నారు.
ఇదిలా ఉంటే లగడపాటి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంపై చాలా అనుమానాలున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం.. అదేసమయంలో చంద్రబాబును లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలవడం.. ఆ వెంటనే లగడపాటి ప్రెస్మీట్ పెట్టి ఈవీఎంలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి ఏం సంబంధం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక సర్వేల విషయంలో కూడా లగడపాటి… చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. ఆనాడు చంద్రబాబుకు అనుకూలంగానే తెలంగాణ ఎన్నికల సర్వేను మార్చి చెప్పారని.. ఈ రోజు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా సర్వే ఇవ్వాల్సి వస్తుందనే.. పోలింగ్ తర్వాత వెల్లడిస్తానని చెబుతున్నారని అంటున్నారు. ఓ వైపు అన్ని సర్వేలు జగన్కు అనుకూలంగా సర్వేలు ఇస్తుంటే.. తాను ఆ పని చేయలేకే సర్వేను వాయిదా వేసుకున్నారని సమాచారం.
ఇక తాను ఏ రాజకీయ పార్టీ తరపున ఏపీలో పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు లగడపాటి. అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పానన్నారు. ఇక చంద్రబాబుతో భేటీ గురించి మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీలో లేనని… ఎవరినైనా కలుస్తానని చెప్పారు. గతంలో జగన్ ను కూడా కలిశానని, పవన్ తో ఫోన్ లో మాట్లాడానని తెలిపారు.