న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో భారత్ పోరాడి ఓడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 213 పరుగుల టార్గెట్ను అందుకోలేక పోయింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కివీస్ 2-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు.
ఆఖరి మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రియులకు ఫుల్గా ఎంటర్టైన్ చేసిందనే చెప్పుకోవాలి. విజయ్ శంకర్, రిషభ్ పంత్ సిక్సర్లు కనువిందు చేశాయి. చివర్లో కృనాల్ పాండ్య, దినేశ్ కార్తీక్ మెరిపించిన మెరుపులు విజయంపై ఆశలు చిగురించేలా చేసినా ఆఖరి ఓవర్లో టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో రోహిత్ సేన విజయానికి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు టీమ్ సీఫెర్ట్ (43) ధాటిగా ఆడి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి జతగా మరో ఓపెనర్ కొలిన్ మున్రో(72) చెలరేగి ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్ ఔటయ్యాడు. ఆ తర్వాత మున్రో-విలియమ్సన్ల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది.
ఏదేమైనా 1-1, 2-1, 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై టీ20, వన్డే, టెస్టు సిరీస్ గెలిచిన సమరోత్సాహంతో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా చివరి మ్యాచ్ ఓటమితో ముగించింది. కానీ ఎన్నో రికార్డులను తమ ఖాతాలో వేసుకొని ఇండియాలో అడుగు పెట్టనున్నారు మెన్ ఇన్ బ్లూ.