దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి జనాలు పిట్టాల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సినీ నటుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు.
అన్ని జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు.
ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. మిషన్ ప్రారంభమైందని, ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని ఆయన అన్నారు. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆర్డర్ చేశామని వివరించారు. అత్యవసరంగా ఎక్కడ ఆక్సిజన్ అవసరం ఉందో తెలుసుకొని అక్కడకు సిలిండర్లు అందిస్తున్నామన్నారు. తన కుమారుడు రామ్ చరణ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నాడని తెలిపారు.