బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్ స్టార్ హీరోలలో షారూఖాన్ ఒకడు. అదికమొత్తంలో పారితోషకం తీసుకుంటున్నా బుద్ధి మాత్రం మారదు. అందరి దృష్టిలో స్టార్ అయినా కానీ చట్టం దృష్టిలో ఇప్పుడో దోషి. ఫోర్జరీ కేసులో ఆధారాలతో పట్టుబడ్డ అతగాడి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఉన్నదానితో తృప్తిపడితే ఎవరికీ ఎలాంటి గొడవా ఉండదు. కానీ అత్యాశతో ఇంకా సంపాదించాలనే వారి కోరికే వాల్లకు సమస్యలు తీసుకొస్తోంది.ఇప్పుడు అలాంటి చిక్కులు తెచ్చిపెట్టే లెక్కల దగ్గరే దొరికిపోయాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఈ సూపర్ స్టార్ ఇప్పుడు అక్రమాస్తుల కేసులో పీకల్లోతున కూరుకుపోయాడన్నది బిటౌన్ సమాచారం.
షారూఖ్ ఖాన్ ఆ మధ్య డెజా వు పార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అలీబాగ్ లో దాదాపు 20 వేల గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. నిజానికి అలా కొనడాన్ని ఎవరూ తప్పు పట్టరు. దండిగా పైసలున్న ఎవరయినా ఆ పనిచేస్తారు. కానీ షారూఖ్ ఖాన్ అలా రాజమార్గంలో కొని ఉంటే ఏ గొడవ ఉండకపోను. బినామి పేర్లతో ఈ పనిచేశాడు.
ఇందుకోసం నకిలీ పత్రాల్ని సృష్టించాడనే ఆరోపణలూ వచ్చాయి. దానికి సంబంధించిన ప్రాధమిక రుజువులు ఉండటంతో ఐ.టీ. అధికారులు అలీబాగ్ లోని ఇరవై వేల గజాల స్థలాన్ని అటాచ్ చేసింది. ఇంతకాలం షారూక్ పక్కనే ఉన్న ఓ సన్నిహితుడే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి బాలీవుడ్ బాద్ షాను ఈ కేసులో ఇరికించాడనే పుకార్లు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి.
షారుక్ ఖాన్ వ్యవసాయం కోసం కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను… విలాసాల కోసం వినియోగిస్తున్నాడనే ఆరోపణ కూడా ఉంది. ఇక్కడ ఫామ్ హౌస్ తో పాటు, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ హెలీపాడ్, ఆర్టిఫిషియల్ బీచ్ లాంటివి షారుక్ ఏర్పాటు చేసుకున్నాడట.
ఈ ఆస్తి రేటు రూ.15 కోట్లు కాగా.. మార్కెట్ విలువ దానికి ఐదు రెట్ల వరకూ ఉంటుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. అలీబాగ్ ప్లాట్లను నకిలీ పత్రాలతో షారుఖ్ సూచనలతోనే కొనుగోలు చేసినట్టు మోరేశ్వర్ ఐటీ అధికారుల ముందు ఒప్పుకున్నాడనీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువైతే… షారుక్ కు ఆరు నెలల నుండీ ఏడేళ్ళ వరకూ శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి భవిష్యత్ ఏంటనేది అయోమయంలో ఉంది.