యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలు కాని ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నాడు.
కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం వందకోట్లు బడ్జెట్ కేటాయించడం మరో కారణం. ఇక ఈ సినిమాకి కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోవడం విశేషం. తాజాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇతను లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, రోబో వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ప్రత్యేక పద్ధతి ద్వారా మనుషులను విభిన్న రూపాల్లో కనిపించేలా చేయగల సత్తా ఇతని సొంతం.
జై లవ కుశ అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో మూడు పాత్రలని ముఖ్యంగా విలన్ పాత్రను విభిన్నంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విలన్ పాత్ర కూడా ఎన్టీఆర్ పోషిస్తున్నా సంగతి తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లి వాన్సీ హార్ట్ వెల్ ని కలిసి కథ చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. అతనితో కలిసి ఎన్టీఆర్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది.
Related