సంచలనాల నటి రాఖీ సావంత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వాలెంటైన్స్ డే ముందు అభిమానులకు షాకింగ్ వెల్లడించింది. బుల్లితెర వ్యాఖ్యాత కెరీర్ మొదలుపెట్టి నటిగా, డ్యాన్సర్గా బాలీవుడ్తోపాటు, దక్షిణాదిలోనూ ప్రేక్షకుల్ని అలరించిన రాఖీ.. ఎన్ఆర్ఐ రితేష్ సింగ్ను వివాహమాడిన సంగతి తెలిసింది. ఆమె గతేడాది బిగ్బాస్ షో వేదికగా తన భర్త రితేష్ సింగ్ని మొదటిసారి అందరికీ పరిచయం చేసింది.
అయితే అంతలోనే ఏమైందో ఏమో.. రితేష్తో ఏడేళ్ల బంధానికి స్వస్థి చెప్పింది. అతడి నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించింది. వాలంటైన్స్ డే ముందు ఇలాంటి ప్రకటన చేయడం ఎంతో బాధగా ఉందని ఆమె తెలిపింది. ‘రితేష్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా దారులు మేం చూసుకోవాలనుకుంటున్నాం. బిగ్బాస్ షో తర్వాత మా జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని విషయాలు నాకు తెలియకుండానే నా చేజారిపోయాయి.
మా మధ్య తలెత్తిన విభేదాలను తొలగించుకుని, కలిసి జీవించేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, చివరికి విడిపోవడమే ఉత్తమమైన నిర్ణయం అనిపించింది. వాలంటైన్స్ డే ముందు ఇలా జరగడం నాకెంతో బాధగా ఉంది. రితేష్ మంచి వాడే. అయినప్పటికీ ప్రస్తుతానికి నా దృష్టంతా కెరీర్, జీవితంపైనే పెట్టాలని, సంతోషంగా జీవించాలని ఉంది’’ అని రాఖీ సావంత్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇంత హఠాత్తుగా రాఖీ సావంత్, రితేష్ మధ్య ఏం జరిగిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.