ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలు వింటే తెలుగు తేజం, తెలుగు ఆత్మగౌరవం, తెలుగు రాజకీయం వినిపిస్తాయి.. కనిపిస్తాయి. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అన్న ఎన్టీఆర్ గా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. టీడీపీ పార్టీ స్థాపించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పల్లె పల్లెనా రాజకీయ చైతన్యం తీసుకు వచ్చారు.
నేడు టీడీపీ వ్యస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. అంతే కాదు రసూల్పురా ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు. అమరజ్యోతి ర్యాలీని నందమూరి బాలకృష్ణ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో గొప్ప ఉత్తేజం వస్తుంది.. అలాంటి మహానుభావులు నూటికో కోటికో ఒక్కరుంటారు అన్నారు. అంతే కాదు ఎన్టీఆర్ పేరు వినిపిస్తేనే తెలుగు పౌరుషం ఉప్పొంగుతుందని అన్నారు. ఎన్టీఆర్ భవన్లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులకు బాలకృష్ణ పళ్లు అందించనున్నారు.