సినిమా: యాత్ర
బ్యానర్: 70MM ఎంటర్టైన్మెంట్స్
తారాగణం: మమ్మూట్టి, రావురమేష్, అనసూయ, సుహాసిని తదితరులు
సంగీతం: కే కృష్ణకుమార్
నిర్మాత: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
రచన, దర్శకత్వం: మహి వీ రాఘవ
విడుదల తేదీ: ఫిబ్రవరి 08, 2019
యాత్ర.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా. దీనిని బయోపిక్ అనేకంటే ఆయజ జీవితంలో పాటించిన విలువలు.. ఆయన ప్రజల పట్ల ఆయన చూపించిన అభిమానం ఆధారంగా తీసిన సినిమా అని చెప్పుకోవడం కరెక్ట్. మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమాపై వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు భారీ అంచనాలు ఉన్నాయి.
రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచిన పాదయాత్ర ఘట్టాన్ని నేపధ్యంగా తీసుకుని దర్శకుడు మహి రాఘవ రూపొందించిన ఈ మూవీ.. 970 స్క్రీన్స్లో భారీ ఎత్తున విడుదలయింది.
నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ… జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్ జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు ఎలా సంపాదించుకున్నారని చిత్రంలో ఎమోషనల్ టచ్తో చూపించారు.
పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో ఎలా విన్నారు.. అనేదే ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఎమోషనల్ కంటెంట్తో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు బరువైన గుండెతో థియేటర్స్ నుంచి బయటకి వస్తాడనటంలో సందేహామే లేదు.
ఇక వైఎస్ పాత్రలో మమ్మూట్టి పరకాయ ప్రవేశం చేశారు. యాత్రలో ఆద్యంతం ఎమోషన్తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి.
అనసూయ వైఎస్ఆర్ ఇంటికి రావడంతో ఈ మూవీ ప్రారంభమవుతోంది. తెలుగు దేశం పార్టీని మనదేశం పార్టీగా చూపించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. తెలుగుదేశం అభ్యర్థిగా కనిపిస్తాడు. రైతుల కష్టాలను చూసిన ఆవేదన చెందిన వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంట్ను ప్రకటించడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ప్రతి సీన్ ఎమోషన్తో మన మనసులను కదిలించేలా తీశారు.
రెగ్యులర్ బయోపిక్లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అక్కడక్కడ పొలిటికల్ సెటైర్లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్ సినిమాకు కామెడీ టచ్ ఇచ్చాయి. ఇక అప్పటి సంఘటనలకు తగ్గట్టుగా ‘బ్రీఫ్డ్ మీ’ డైలాగ్ను జోడించిన సన్నివేశం నవ్వులు పూయించింది.
సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్ రాజశేఖర్రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్ఆర్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ కదిలిస్తుంది. మరోసారి ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది. యాత్ర తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహత్తర ఘట్టానికి సాక్ష్యం. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం.