కుట్రలకు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ చైనా అన్న విషయం తెలిసిందే. ఇటీవల భారత్ తో వీలు చిక్కినప్పుడల్లా గొడవకు దిగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ విద్యుత్శాఖపై చైనా హ్యాకర్ల కన్ను పడింది. తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లు హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. గమనించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ తెలంగాణ విద్యుత్ శాఖకు హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే సరిహద్దుల్లో బుసలు కొడుతున్న చైనా.. దేశం లోపల కూడా అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నింది.
అవును ఓ అమెరికా సంస్థ వెల్లడించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత ఏడాది అక్టోబర్ 12న ముంబై విద్యుత్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 12 గంటల పాటు పవర్ ఆగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కటేమిటి మనిషి పడే ఎన్నో సమస్యలు కారణంగా నిలిచింది. విద్యుత్ సిబ్బందికి కూడా విద్యుత్ వ్యవస్థ ఎలా స్తంభించిపోయిందో అంతుచిక్కలేదు. చివరకు నగరానికి విద్యుత్ సరఫరా చేసే గ్రిడ్ లోపం వల్లే పవర్ కట్ అయ్యిందని తేల్చారు.
ముంబైలో పవర్ కట్ వెనుక జిత్తుల మారి చైనా హస్తం ఉన్నట్లు అమెరికా సంస్థ తేల్చడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ చైనా కుట్రలను ఆధారాలతో సహ బయటపెట్టింది. భారత విద్యుత్తు సంస్థల కంప్యూటర్ నెట్వర్క్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్లను చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని తేలింది. తాజాగా ఇప్పుడు తెలంగాణ విద్యుత్శాఖపై చైనా హ్యాకర్ల కన్ను పడింది.
గమనించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ తెలంగాణ విద్యుత్ శాఖకు హెచ్చరికలు జారీచేసింది. సర్వర్లు, కంట్రోల్ ఫంక్షన్స్ గమనించాలని సీఈఆర్టీ సూచించింది. ఈ నేపథ్యంలో విద్యుత్శాఖ వెబ్సైట్లో యూజర్ ఐటీ, పాస్వర్డ్లను మార్చారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. చైనా హ్యాకర్లపై కేంద్రం అప్రమత్తం చేసిందన్నారు.
రాష్ట్ర సర్వర్లపై హ్యాకింగ్కు పాల్పడి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలిపిందన్నారు. కాగా, కేంద్ర సమాచారంతో సాంకేతిక విభాగం అప్రమత్తమైందన్నారు. గ్రిడ్ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మారిటైమ్ ఇండియా సమ్మిట్.. పెట్టు బడులకి సీఎం జగన్ పిలుపు..!