జగన్ ఒక్కడే ఇటు వైపు, రాష్ట్ర ద్రోహులు ఒక్కటయ్యారు అని మండిపడ్డారు వైసీపీ అధినేత జనగ్. బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలో మాట్లాడిన జగన్..ఈ సభకు వచ్చిన సైన్యానికి సెల్యూట్ చేశారు. పేదవాడి బతుకును కాపాడేందుకు మీరంతా సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడి పాత్ర ప్రజలదని, అర్జునుడి పాత్ర తనదన్నారు.
పార్టీల పొత్తులతో చంద్రబాబు , ప్రజలే బలంగా తాము ఎన్నికల్లో పోటీ పడుతున్నామని చెప్పారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు ఇప్పుడు కలుస్తున్నాయని ఎద్దేవా చేశారు. విశ్వసనీయతకు, వంచనకు పోటీ జరుగుతోందని… జగన్ ఒక్కడే అయినా..చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఏపీలో మన ప్రభుత్వం చేసిన మంచితో మన ప్రజా బలం ముందు తలపడలేక చంద్రబాబు అందరి సాయం తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు, టైర్లు, చక్రాలే లేవని…ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడుని తెచ్చుకున్నారని సెటైర్ వేశారు. పార్టీల పొత్తులతో బాబు వస్తుంటే… ప్రజలే బలంగా మనం సిద్దమయ్యామని జగన్ చెప్పారు. చంద్రబాబు లాగా తనకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరని…తనకు పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతీ గడపలో ఉన్నారన్నారు.