సర్కారు వారి పాట చిత్రంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. SSMB 28 గా పిలుచుకుంటోన్న ఈ సినిమా మార్చ్లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా.. మరో కీలక పాత్రను సీనియర్ హీరోయిన్ శోభన చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
మహేశ్ బాబుకు ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో అతడికి పోటీగా మరో స్టార్ హీరో విలన్గా నటిస్తే .. ఇక యాక్షన్ సీన్లు అదిరిపోయినట్లే. ‘బాహుబలి’ లో ప్రభాస్ తో ఢీ కొట్టడానికి అదే రేంజ్ ఆజాన బాహుడైన రానాను నటింపచేసి దర్శకుడు రాజమౌళి రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మ్యాజిక్కే మహేశ్ సినిమాలో రిపీట్ కాబోతోంది. ఇందులో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ ను ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం.
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే విక్రమ్ .. విలన్గా ఇంతకు ముందు ‘ఇరుముగన్’ అనే మూవీలో ట్రాన్స్జెండర్ పాత్రలో విలనిజాన్ని పండించాడు. ఆ పాత్ర విక్రమ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అపరిచితుడు సినిమాలోనూ విక్రమ్ విభిన్న కోణాలను ప్రదర్శించాడు. ఇక మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో విక్రమ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆదిపురుష్ లో ప్రభాష్ పాత్ర పేరు రాముడు కాదు