జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విలువనిచ్చాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు. పవన్ కోరిక మేరకు.. ఆయన సిఫార్సు మేరకు వ్యవహరించాయి ఆ పార్టీలు. ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన హీరోకు ఆ పార్టీలు ఇలా విధేయతను చాటుకొన్నాయి. పవన్ మాటను తాము వింటున్నాం.. మన మా వాడే..అనే ఇండికేషన్ ను కూడా ఇచ్చాయి ఆ పార్టీలు! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇది ఎమ్మెల్సీ సీటు వ్యవహారంలో!
మిత్రధర్మం కింద భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల్లో తమతో కలిసిపోటీచేసి.. ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఈ విధంగా ప్రాధాన్యత ఇచ్చింది. ఒక ఎమ్మెల్సీ సీటును ఇవ్వడం ద్వారా మిత్ర ధర్మాన్ని పాటించింది. ఇదే సమయంలో ఆ ఎమ్మెల్సీ సీటు భారతీయ జనతా పార్టీ నేత సోమూవీర్రాజుకు దక్కడం మరింత ఆసక్తికరమైన విషయం.
ఈ వీర్రాజు ఎవరో కాదు.. బీజేపీలో పవన్ కు బాగా సన్నిహితమైన వ్యక్తి. ఆది నుంచి పవన్ తో టచ్ లో ఉన్న కమలనాథుడు. ఈ నేపథ్యంలో వీర్రాజు.. చాలా రోజులు తన పదవి కోసం జనసేన అధినేత చేత లాబీయింగ్ చేయించుకొన్నాడు. తెలుగుదేశం, బీజేపీ నాయకత్వాలపై పవన్ చేత ఒత్తిడి తెప్పించి.. పదవిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు నెరవేరాయి. పవన్ సిఫార్సు మేరకు ఆయనకు పదవి దక్కింది.
దీంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూడా పవన్ కు విలువనిస్తున్నట్టే అయ్యింది. మొత్తానికి పవన్ చక్రం తిరుగుతోందనమాట. ముందు ముందు ఇది మరింత ఊపును సంపాదిస్తుందేమో చూడాలి!