విధుల్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాను చనిపోతున్నా అందులోని ప్రయాణీకులను కాపాడారు. తనకు గుండెపోటు వచ్చినా 20 మంది ప్రాణాలు కాపాడేందుకు ఎంతో చాకచక్యంగా బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి తుదిశ్వాస విడిచారు.ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది.
ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టెక్కలి దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి దింపి మృతి చెందాడు. అప్పటికి బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలే జాతీయ రహదారి, తేడా అయితే ప్రమాదం జరిగి అందరి ప్రాణాలు పోతాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్ ప్రాణాలను బిగపట్టుకుని జాగ్రత్తగా బస్సును రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి తీసుకువెళ్లాడు. బస్సు సురక్షితంగా నిలిచిన కాసేపటికి జోగేందర్శెట్టి తుదిశ్వాస విడిచాడు.ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.