సీపీఎం పార్టీ సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అత్యంత నిరాడంబరమైన నేతగా, ప్రజల కోసమే చివరివరకు పాటుపడిన చిత్తశుద్ధి ఉన్న ప్రజాసేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బొజ్జ. అనారోగ్యంతో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రజల సేవ తన జీవితాన్ని అంకింతం చేశారు కుంజా బొజ్జి.
ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కనీసం ఉండటానికి సొంత ఇళ్లు కూడా లేదు. ఇటీవలే ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన భార్య లాలమ్మ మూడేళ్ల కిందట మరణించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1985, 89, 1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేవారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థమవుతుంది. ఆఖరికి తన పెన్షన్ ను కూడా ప్రజల కోసమే ఖర్చుచేసిన నిస్వార్థపరుడు. కుంజా బొజ్జి మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి.