గుజరాత్లోని సూరత్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సర్తానా ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులో కోచింగ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 20 మంది విద్యార్ధులు సజీవదహనమయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. మంటల బారి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు విద్యార్థులు బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంటలను అదుపు చేసేందుకు 18 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనపై సీఎం విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.