ఇప్పుడు కాదు.. అప్పుడెప్పుడో తొలిసారి హీరో శివాజీ రాజకీయ రంగ వార్తల్లోకి వచ్చినప్పటి నుంచే ఒక మీడియాధినేత శివాజీని బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఇతడిని వార్తల్లో నిలపడానికి ఆ మీడియాధినేత ప్రయత్నిస్తున్నాడు.
తన వార్తా సంస్థల ద్వారా ఈ హీరోకు మంచి ప్రాధాన్యతను ఇస్తున్నాడు. ఇతడిని చర్చకార్యక్రమాలకు ఆహ్వానించడం అయితేనేమీ.. మరో రకంగా నైతేమీ.. శివాజీని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడాయన.
శివాజీ ఏవైనా ధర్నాలూ గట్రా చేస్తే.. ఈ మీడియాధినేత ఛానల్ లో వాటి గురించి ప్రసారాలు ఉంటాయి. శివాజీ చిన్న చిన్న పాత్రలు చేసుకొనే రోజుల్లో ఆ మీడియాధినేత కూడా చిన్న జర్నలిస్టుగా ఉండేవాడు. శివాజీకి టైమ్ కలిసొచ్చినప్పటి నుంచినే ఆ మీడియాధినేతకు కాలం కలిసొచ్చింది. అప్పటి నుంచి వీరి బంధం ఇలాగే కొనసాగుతోంది!
సినిమాల్లో అవకాశాలు కరువైపోయి.. చేతిలో చిన్న చిన్న సినిమాలు కూడా లేకపోవడంతో శివాజీ తన కామెంట్లతో వార్తల్లోకి వస్తున్నాడు. మొదట్లో శివాజీ జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితుల కుటుంబాల తరపున మాట్లాడాడు. అప్పట్లో ఇతడిని అందరూ మెచ్చుకొన్నారు.
అయితే శివాజీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో.. అప్పుడే తేడాలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఈ హీరోకు అంత ప్రాధాన్యత దక్కలేదు. ఎన్నికల తర్వాత కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం గురించి శివాజీ గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇది కూడా అభినందనీయమే. అయితే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొన్న శివాజీ మాటలు ఇప్పుడు మిస్ ఫైర్ అయ్యాయి. ఈయనకు బీజేపీ నేతలతోనే తంటాలు తెచ్చిపెట్టాయి ఆ మాటలు.
దీంతో శివాజీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాడు. తను బీజేపీ నేతనలను ఏమీ లేదని వివరణ ఇచ్చుకొంటున్నాడు. బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇతడి విషయంలో నిరసన తెలుపుతున్నారు. మరి ఇప్పుడు తన స్నేహితుడు ఆపదలో పడటంతో.. ఆ మీడియాధినేత ఎలా జోక్యంచేసుకొంటాడో!