అమరావతి: లక్ష కోట్లు.. అనే మాట తెలుగు ప్రజలకు బాగా పరిచయమే. రాజకీయ పార్టీ అధినేతలకు, కోట్ల స్యామ్లు చేశారనే పుకార్లకు విడదీయరాని సంబంధముంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష కోట్ల స్కామ్ చేశారని టైడీపీ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో వాస్తవమెంత అనే సంగతి పక్కనబెడితే అటు వైసీపీ కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై లక్ష కోట్ల స్కామ్ చేశారంటూ ఆరోపిస్తోంది. రాజధాని అమరావతి విషయంలో పెద్ద కుంభకోణమే జరిగందంటూ చంద్రబాబును తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే చంద్రబాబు తాజాగా ఈ లక్ష కోట్ల స్కామ్ గురించి మాట్లాడారు.
అమరావతిలో విట్ యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం ప్రసంగించారు. రాజధాని కావాలంటూనే కొందరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. లక్ష కోట్ల స్కామ్ జరిగిపోయిందటూ కోర్టులకు సైతం వెళుతున్నారని అన్నారు. అయినా వీటిని పట్టించుకోకుండా తమకు రైతులు సహకరించారని, అభివృద్ధి చేసి తీరతామని చెప్పారు చంద్రబాబు. తనపై నమ్మకంతోనే విట్ ఇక్కడకు వచ్చిందని రోడ్ల సదుపాయం కల్పించడం వంటి అవసరాలను తీర్చడంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. విట్తో పాటు మరిన్ని యూనివర్శిటీలు ఇక్కడకు వస్తాయని, ఆక్స్పర్డ్, స్టాన్ఫర్డ్ వంటి యూనివర్శిటీలు కూడా భారత్కు రావాల్సిన అవసరముందన్నారు ఏపీ సీఎం.
అయితే ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులను నమ్మడానికి లేదనుకునే ప్రజల్లో ఇప్పటికే ఓ చర్చ మొదలైంది. జగన్ సంగతి సరేగానీ చంద్రబాబు స్కామ్ చేయలేదని గ్యారెంటీ ఏమిటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అందుకు ఆధారంగా రాజధానికి భూ సేకరణ నుంచి ఓటుకు నోటు కేసు వరకు చూపిస్తున్నారు. ఇక జగన్పై ఎంతటి ఆరోపణలు ఉన్నాయో, ఎలాంటి చర్చలు నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో మధ్యేమార్గంగా ఉండే కొందరు మాత్రం ఇంతకీ లక్ష కోట్ల స్కామ్ చేసింది జగనా లేక చంద్రబాబా? అనే ఆలోచనలో పడిపోయారు. ఈ ప్రశ్నకు సమాధనం దొరుకుతుందో లేదో కానీ, లక్ష కోట్లనే మాట మాత్రం తెలుగు ప్రజలను వదలడంలేదు.