ఈ మద్య తెలంగాణలో కృరమృగాల బెడద ఎక్కువైందని పలు సందర్భాల్లో చూశాం. ఆ మద్య నగరంలో చిరుత పులి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా కుమురంభీం జిల్లాలో దారుణం జరిగింది. అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్(22) అనే ఆదివాసీ యువకుడిపై పెద్ద పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్ (22) తన స్నేహితులు శ్రీకాంత్, నవీన్లతో కలిసి పత్తిచేను వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పొదలచాటున మాటువేసిన పులి విఘ్నేశ్పై దాడిచేసి నోట కరచుకుని అడవిలోకి లాక్కెళ్లింది.
నవీన్, శ్రీకాంత్ పులి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. వెంటనే గ్రామంలోకి వెళ్లి విఘ్నేశ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి వచ్చి ఆ ప్రాంతంలో గాలించగా ఓ చోట విఘ్నేశ్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కాగా, ఇప్పటి వరకు అదిలాబాద్లోని పలు మండలాల్లో గొర్రెలు, మేకలు వంటి పశువులపై పెద్ద పులు దాడి చేశాయి. దివిడ గ్రామాన్ని నేడు ఎస్పీ సత్యనారాయణ సందర్శించారు. మరోవైపు పెద్ద పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో నేడు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయనున్నారు.
గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!
దారుణం.. అందుకు ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!