పరిచయం అక్కర్లేని పేరు ఆనందయ్య. కరోనా వైరస్ తో విలవిల్లాడుతున్న జనానికి నేనున్నానంటూ ఆనందయ్య ఆపద్బాంధవుడిగా నిలిచాడు. కరోనా నివారణకు ఆనందయ్య తయారుచేసిన ఆయుర్వేద మందు సంజీవనిలా నిలిచింది. ఆయన తయారు చేసిన ఆయుర్వేద మందు కరోనా వ్యాధి నివారిణిగా బాగా పనిచేస్తుందంటూ పేరు వచ్చింది. దీంతో ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా మార్మోగింది.కోర్టులు కూడా ఆయన తయారు చేసే ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి ఇవ్వడంతో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతోంది.
కరోనాకు మందు తయారు చేసిన ఆనందయ్య కు ఎమ్మెల్సీ పదవి అవకాశం కల్పించాలని వెన్నెల ఫౌండేషన్ వైస్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ఏపీ గవర్నర్ హరి చందన్ కు లేఖ రాశారు. ఆయుర్వేద మందు తయారు చేసి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిన ఆనందయ్య లాంటి వ్యక్తిని చట్టసభలకు నామినేట్ చేస్తే ఎంతో గౌరవంగా ఉంటుందని, ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని సుంకర నరేష్ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖపై ఏపీ గవర్నర్ కార్యదర్శి స్పందించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఆయన ఓ లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(E), 171(5) ప్రకారం ఆనందయ్య ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి సూచించారు. తాను రాసిన లేఖకు గవర్నర్ కార్యదర్శి స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆనందయ్య లాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా నియమితులైతే ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు.
Also Read
థర్డ్వేవ్ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!