అంబానీల ఇంట మరో పెళ్లి భాజా మోగనుందా..? ఇప్పటికే ఆకాశ్ అంబానీ పెళ్లి ఫిక్స్ కాగా.. అతడి కవల సోదరి ఇషా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. పిరామల్ ఎంటర్ప్రైజెస్ అధినేత అజయ్ పిరామల్ తనయుడు ఆనంద్ పిరామల్, ఇషాలు మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం.
ఆనంద్, ఇషాలు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్, ఇషాకు ప్రపోజ్ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలకు విషయం చెప్పారు. కాగా, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్, ఇషాల వివాహం జరుగుతుందని తెలిసింది.
ఇషాకు ఆనంద్ పిరమాళ్ ప్రపోజ్ చేస్తోన్న ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో చక్కర్లు కొడుతున్నారు. కానీ వీరిద్దరి పెళ్లి విషయమై ఇరు కుటుంబాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. హలో మ్యాగ్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఇషాను ఆనంద్ ముద్దాడుతున్న అందమైన ఫొటోను షేర్ చేసి వారు త్వరలోనే పెళ్లాడబోతున్నారని చెప్పింది.
ఆనంద్ హర్వాడ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివారు. భారత్లో పిరామల్ ఈ-స్వాస్థ్య, పిరామల్ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో ఇషా సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు.