నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన ఘటనలో ఓ యువకుడు చేసిన పని అందరూ అభినందిస్తున్నారు. నల్గొండ జిల్లా పీఎపల్లి మండలం వద్దిపట్ల వద్ద శుక్రవారం (ఏప్రిల్ 6) తెల్లవారుజామున ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఏఎంఆర్ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు.
అయితే ఈ ప్రమాద సమయంలో ఓ యువకుడు తన ప్రాణాలు పణంగా పెట్టి 14 మందిని కాపాడాడు. ప్రమాదంలో రమావత్ హన్మ అనే యువకుడు కూడా చిక్కుకున్నాడు. అయితే తనను తాను కాపాడుకుంటూ కాలువలో పడిన వారిని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. నీటిలో మునిగిన వారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 14 మందిని కాపాడాడు.
ఈ యువకుడు వారి ప్రాణాలు కాపాడకపోయి ఉంటే ప్రమాదం తీవ్రత భారీగా ఉండేది. పెద్ద సంఖ్యలో మృతులు ఉండేవారు. దీంతో హన్మను పోలీసులు, అధికారులు, ప్రజలు ప్రశంసించి అతడి సాహసాన్ని కొనియాడారు. తన ప్రాణాలను పట్టించుకోకుండా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రమావత్ హన్మను రాష్ర్టపతి సాహస అవార్డ్కు సిఫారసు చేస్తామని నల్గొండ ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు.
స్వల్ప గాయాలపాలైన రమావత్ హన్మ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.