తెలుగు ప్రజలు కలలు కంటున్న అమరావతి రాజధాని నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రిన్సిపల్ బెంచ్ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే పర్యావరణం దెబ్బతినకుండా, నిబంధనలకు లోబడే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. అలాగే పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన 190 నిబంధనలను అమలు చేయాలని ట్యిబ్యూనల్ ఆదేశించింది. దాంతో పాటు కొండవీటి వాగు దిశను మార్చరాదని, కరకట్టలను ముందుకు జరపవద్దని స్పష్టం చేసింది. అలాగే పర్యావరణ శాఖ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది.
రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుండటంపై పి.శ్రీమన్నారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు 2015 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. దాదాపు 22 నెలలపాటు సుదీర్ఘ విచారణ తర్వాత ఎన్జీటీ శుక్రవారం అనుమతి తెలిపింది. దీంతో అమరావతి రాజధాని నిర్మానం ఊపందుకోనుంది.