ఎన్నికల వేల కోట్ల డబ్బులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బులు పంచేందుకు నాయకులు సిద్దమవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పట్టుబడిన డబ్బులోఏపీ రెండో స్థానంలో ఉంది. తాజాగా హైటెక్ సిటీ ప్రాంతంలో ఏపీ టీడీపీకీ చెందిన రూ.2 కోట్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో సైబరాబాద్ లో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. హైటెక్ సిటీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారనీ, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామని సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ తెలిపారు.ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. పట్టుబడిన డబ్బులో రూ.96 లక్షల వరకూ 500 రూపాయల నోట్లు… మిగతావి 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు సజ్జన్నార్ తెలిపారు.జయభేరీ సంస్థకు చెందిన ధర్మారాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీ మోహన్ కు అందించాల్సిందిగా చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరి అంగకరించారన్నారు.ఆ డబ్బును రాజమండ్రికి రైళ్లలో తరలించేందుకు ఆ ఇద్దరూ యత్నించినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్, యలమంచిలి మురళీకృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదుచేశారు పోలీసులు.భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.