తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశానికి ఇది కష్టకాలం. ప్రముఖనేతలు పార్టీ నుంచి జారుకున్నారు. ఏ ఎన్నికలకు వెళితే ఆ ఎన్నికల్లో పరాభవం! పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. తెలంగాణలో దేశం అధికారంలోకి వచ్చే వరకూ ఇక్కడే ఉంటానని చెప్పిన పార్టీ అధినేత.. ఇప్పుడు ఏపీకి మాత్రమే పరిమితం అయిపోతున్నారు.
ఏమైనా అంటే, టి.దేశం నేతలు స్వతంత్రంగా వ్యవహరించాలనీ, సొంతంగా ఎదగాలి, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని కబుర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టి.దేశాన్ని ఆదుకునేది ఎవరు..? పాతాళ స్థాయిలో దిగబడిపోయిన పార్టీని పైకి లేపేదెవరు..? అంటే… నేనున్నాను అంటున్నారు రేవంత్రెడ్డి.
రేవంత్రెడ్డి తనకు తానే సొంతంగా ఓ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టున్నారు. దేశం కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ భరోసా నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండలో జరిగిన మినీ మహానాడులో రేవంత్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆయన ఒక కర్కోటక ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. ఆయన్ని గద్దె దించడమే తన ఆశయం అన్నారు. దీని కోసం తన యావత్ జీవితం ధారపోయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్తో కలబడి, నిలబడి, పడగొడతా అంటూ ప్రతినబూనారు. ఇంకో విశేషం ఏంటంటే… వచ్చే ఎన్నికల నాటికి తానే టిక్కెట్లు ఇస్తానని చెప్పడం విశేషం! తెలుగుదేశం కార్యకర్తలపై ప్రస్తుతం కొన్ని కేసులు ఉన్నాయనీ, వాటి ఖర్చులను తానే భరిస్తానని రేవంత్ ప్రకటించారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తాననీ, తెలుగుదేశం అభ్యర్థులను తానే గెలిపిస్తానని రేవంత్ చెప్పారు.
రేవంత్ చాలా పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే, పార్టీ తరఫున ఆయనే టిక్కెట్లు ఇస్తారట, ఆయనే పాదయాత్ర చేసి ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకుంటారట! తెలంగాణ తెలుగుదేశం నేతలు స్వతంత్రులుగా వ్యవహరించాలని చంద్రబాబు అంటుంటారు. రేవంత్ రెడ్డి అంతకుమించి ఫ్రీడమ్ తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. మరి, రేవంత్కు అంత వెసులుబాటు కల్పిస్తారా..? వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీ బాధ్యతలు మొత్తం చంద్రబాబు ఆయనకే అప్పగిస్తారా..? ఇంతకీ, రేవంత్ పెట్టుకున్న ఈ లక్ష్యం నెరవేరుతుందా..?