మొహాలి స్టేడియంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ మోత మోగించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించి ద్విశతకం నమోదు చేశాడు. లకం బౌలర్లకు చుక్కలు చూపించారు. తనకు ఎదురలేదని వీర విహారం చేశారు.
తొలి వన్డే ఓటమితో ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్.. వంద పరుగులు పూర్తి చేయడానికి 115 బంతులు తీసుకున్నాడు. కెరీర్లో 16వ సెంచరీ పూర్తయ్యాక మాత్రం చెలరేగిపోయాడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ 36 బంతుల్లోనే వంద పరుగులు పిండుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై బ్యాటింగ్తో విరుచుకుపడుతున్న రోహిత్ను చూసి గ్యాలరీలో ఉన్న ఆయన భార్య రితిక తెగ మురిసిపోయింది. అతడు డబుల్ సెంచరీ చేయగానే ఒకింత భావోద్వేగానికి లోనైంది. ఆనంద బాష్పాలు రాల్చింది. లేచి నిల్చుని చప్పట్లతో భర్తను అభినందించింది.
డబుల్ సెంచరీ పూర్తయ్యాక.. రోహిత్ రెండు చేతి వేళ్లను మాత్రమే తెరిచి ఉంగరపు వేలిని ముద్దాడుతూ కనిపించాడు. రితికకు గాల్లో ముద్దులు విసిరాడు. హిట్ మ్యాన్ ఇలా చేయడానికి కారణం.. డిసెంబర్ 13న అతడి పెళ్లి రోజు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున అతడు రితికను పెళ్లాడాడు. పెళ్లి రోజున 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేసిన నాటౌట్గా నిలిచిన రోహిత్.. తన భార్యకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.