తెలంగాణా సీఎం కేసీఆర్ కాంగ్రెస్, భాజాపాపై నిప్పులు చెరగిరారు. మీ పని అయిపోయిందంటూ హెచ్చరించారు. దేశ రాజకీయాలపై తాను చేసిన ప్రకటనతో ప్రకంపనలు పుట్టాయని తెలిపారు. దేశంలో ఫెడరల్ ఫ్రంట్పై అవహేళన చేస్తున్నవారు ఉలిక్కిపడేలా చేస్తానన్నారు. దేశానికి మంచి దారి చూపెడతానని అన్నారు. హైదరాబాద్ కేంద్రం నుంచే దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తానని, తెలంగాణ బిడ్డగా ప్రజల గౌరవాన్ని నిలబెడతానని ప్రకటించారు.
హైదరాబాద్లోని కొంపల్లిలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాలపై సమర శంఖం పూరించారు. ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్ కార్యాచరణను ఆవిష్కరించారు. జాతీయ రాజకీయాల దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
దేశ రాజకీయాలపై మాట్లాడితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను భాజాపా ఏజెంట్ అంటూ విమర్శించారని అన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని… వాటి అసమర్థత వల్లే నీటి యుద్ధాలు వస్తున్నాయని మండిపడ్డారు.
దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉందని… సాగుభూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమేనని… 40 వేల టీఎంసీలతో ప్రతి ఎకరాకు నీటిని ఇవ్వచ్చని కేసీఆర్ చెప్పారు. నీటి వివాదాలను ట్రైబ్యునళ్లు తాత్సారం చేస్తుండటంతో… రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. 40 కోట్ల ఎకరాలకు నీటిని ఇచ్చే పథకాలను రూపొందిస్తామని, ఫెడరల్ స్పూర్తితో రైతాంగ సమస్యలపై పోరాడతామని చెప్పారు.
అంతర్జాతీయ టూరిజంను అభివృద్ధి చేయడం లేదని, రైల్వే వ్యవస్థ అద్వాన్నంగా ఉందని, ఎయిర్ పోర్టులు, పోర్టులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఈ పార్టీల నాయకత్వాన్ని నమ్ముకుంటే దేశం బాగుపడదని చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వల్ల ఎంతో మంది జవాన్లు చనిపోతున్నారని… ఇంటర్నేషనల్ డిప్లమసిలో కేంద్రం తెలివితేటలు చూపకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు.
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని… గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని, దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొస్తానని అన్నారు.