ఏదైనా విషయం మీద ఎంతటి కాక రేపగాలరో అంతే తేలికగా అదే విషయం మీద అందరిలో సైలెన్స్ తీసుకుని రాగలరు మన రాజకీయ నాయకులు. అంతటి ప్రతిభా పాటవాలు ఉన్నవాళ్ళు కాబట్టే ముఖ్యమంత్రులూ, కేంద్రం మంత్రులూ అయ్యి మనల్ని పాలిస్తున్నారు. ప్రత్యేక హోదా ని డిమాండ్ చేసి అది లేకపోతే బతకలేం అని చెప్పినవారే ఇప్పుడు ప్రత్యేక హోదా ని చుట్టి అవతల పడేస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసే వారు.. విమర్శలు చేస్తున్న వారు రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజిస్తున్న సమయంలో ఏం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వెంకయ్య. హోదా గురించి మాట్లాడే ముందు.. రాష్ట్ర విభజనపై తాను వేసిన ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుంటుందంటున్నారు. ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాను కలిసి మోసం చేస్తున్నామని చెప్పే వారంతా.. ఏపీకి పచ్చి మోసం జరిగే సమయంలో ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని స్పష్టం చేసిన వెంకయ్య.. ‘‘ఒక్కటైనా హామీ నెరవేర్చారా అని అంటున్నారు. ఐఐటీ.. ఐఐఎం లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏర్పడిన విషయాన్ని మర్చిపోతున్నారు. అలాంటివి చూసే వారికి మాత్రమే కనిపిస్తాయి. వినే వారికే వినబడతాయి. కానీ.. ఏమీ చూడం.. ఏమీ వినమనే వారంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని ఏమీ చేయలేం’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.