ఐదు రాష్ర్టాల ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ఎంత వార్తల్లో నిలిచిందో అంతకంటే ఎక్కువగా ఫలితాల తర్వాత తెరమీదకు వస్తోంది. ముఖ్యంగా సీఎం పదవిని బీజేపీ అగ్రనేత యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఊహించని వార్తల్లోకి ఎక్కుతోంది.
ఇక తాజా విషయానికి వస్తే…ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి హిమాంష్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యారు. యూపీలో కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పోలీసు శాఖలో యాదవ కులానికి చెందిన వారిపై వేధింపు చర్యలకు పాల్పడుతోందని చేసిన ట్వీట్ లే ఇందుకు కారణం. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా హిమాంశ్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆదేశాలపై హిమాంశ్ కుమార్ ను డీజీపీ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు.
ఇదిలాఉండగా…ఉత్తరప్రదేశ్ మంత్రి మోసిన్ రాజాకు వినూత్న అనుభవం ఎదురైంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఒకింత షాక్కు లోనయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, మాజీ మంత్రి అజాంఖాన్ ఫోటోలు గోడకు తగిలించి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ…పాత మంత్రుల ఫోటోలు ఉండటం పట్ల మోసిన్ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫీస్ మొత్తం తిరిగిన ఆయన, పరిశుభ్రతపై అధికారులను మందలించారు. ప్రస్తుతం మోసిన్ నిర్వహిస్తున్న శాఖకు..గతంలో అజాంఖాన్ మంత్రిగా ఉండేవారు. దాంతో ములాయం, అజాంఖాన్ లు కలిసి ఉన్న ఫోటోను ఆఫీస్ లో ఉండిపోయినట్లు ఉద్యోగులు తెలిపారు.