ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి రైతు సమస్యలపై పోరాడేందుకు సిద్దమవుతున్నారు. ఈనెల 26,27వ తేదీలలో గుంటూరులో రెండు రోజుల పాటు రైతు నిరహార దీక్ష చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. జగన్ రెండ్రోజులపాటు ఈ దీక్ష చేపట్టనున్నారు.
ఒక వైపు పంటల దిగుబడి తగ్గిపోయి పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే…. దళారులు కుమ్మక్కయ్యి ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా కూడా ఈ అంశంపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన దీక్ష మొదలుపెడుతున్నారు.
గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనం అవుతున్నాయి. దుగ్గిరాల పసుపు మార్కెట్లో కూడా అదే పరిస్థితి ఉంది. ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. అయితే దీక్షా స్థలాన్ని మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదు. స్థలాన్ని నిర్ణయించిన తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Related