పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రోజుకో సంచలన నిర్ణయంతో దూసుకుపోతున్నారు. అవినీతికి తావు లేకుండా.. పారదర్శక పాలన దిశగా సంచలనాలకు తెర తీస్తున్నారు.రాష్ట్రంలో ఇకనుంచి అవినీతిని సహించేది లేదని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్ల సదస్సునుంచి అక్రమార్కులను హెచ్చరించారు. ప్రజా వేదికను నిబంధనలకు విరుద్దంగా, అవినీతి, అక్రమ సంపాదనతో ఈ భవన నిర్మాణం జరిగిందన్నారు జగన్. అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికలో సమావేశం పెట్టే దుస్థితి ఏర్పడిందని.. గత ప్రభుత్వ హాయాంలో అవినీతి ఏ విధంగా ఉందో చెప్పడానికే ప్రజావేదికలో సమావేశాన్ని ఏర్పాటు చేశానని అధికారులకు చురకలంటించారు.
ముఖ్యమంత్రి నెక్ట్స్ టార్గెట్ ఏంటనే చర్చ మొదలయ్యింది. ప్రజా వేదిక తర్వాత.. అధికారులు కరకట్టపై ఉన్న భవనాలపై ఫోకస్ పెడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదుల తీరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా ఏపీ ప్రభుత్వం కూల్చివేయవచ్చని తెలుస్తోంది.
బాబు నివాసం కూడా అక్రమ నిర్మాణం కిందికే వస్తే.. కూల్చడం ఖాయం. ఒకవేళ కరకట్టపై నిర్మాణాలపై ఫోకస్ పెడితే చంద్రబాబు నివాసం కూడా కూల్చేయక తప్పదు. 2014లో ఏపీ ప్రభుత్వం కరకట్ట సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన 22 మందికి నోటీసులు జారీచేసింది. అయితే వీరంతా రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు కావడంతో అధికారులు ముందుకు వెళ్లలేకపోయారు.
చంద్రబాబు నివాసాన్ని ఇప్పుడే కూల్చకపోవచ్చని కొందరు ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రైవేటు అక్రమ కట్టడాలను సహించబోమని సీఎం జగన్ పరోక్షంగా హెచ్చరిక జారీచేశారని చెబుతున్నారు.