నాలుగేళ్లుగా భాజాపాతో కలసి ప్రయాణం చేసిన టీడీపీ చివరకు ఎన్డీఏనుంచి వైదొలిగేందుకు సిద్దం అయ్యింది. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు కలసి కాపురం చేసిన రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా టీ డీపీపై భాజాపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు అర్థమైందన్నారు. అందుకే నెపాన్ని కేంద్రంపైకి నెట్టేందుకు ప్రణాళిక ప్రకారం ప్రచారం మొదలుపెట్టారని జీవీఎల్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండికూడా 29సార్లు ఢిల్లీ వెళ్లి ఒక్క పని కూడా చేయించుకోలేని అసమర్థ వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ వైదొలగడం తమకొక మంచి అవకాశం అని, తమ వ్యూహాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఏపీలో టీడీపీని ఎదుర్కునే శక్తి బీజేపీకి ఉందని, రాష్ట్రంలో గెలవలేనివారు ఢిల్లీలో ఏం చేయగలరని ఆయన సూటిగా ప్రశ్నించారు. తమ చేతగాని తనాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారని దుయ్యబట్టారు.
