చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు పలువురు మంత్రులపై సీబీఐ విచారణ జరగనుందా..? సాక్ష్యాత్తూ బాబే సీబీఐ విచారణ అంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమా…? పరిస్థితులు చూస్తుంటే అవుననే అంటున్నాయి. ఎంపిలు, కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినపుడు అవే అనుమానాలను వ్యక్తం చేశారు.
బీజేపీ, జనసేన, వైసీపీ కుమ్మక్కై తెలుగుదేశం సర్కారుపై ముప్పేట దాడికి దిగుతున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలు కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగాలని ఆయన పిలుపునిచ్చారు. కక్ష సాధింపుల్లో భాగంగా తనపైన, లోకేష్ తో పాటు మంత్రులపైన కూడా సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు చంద్రబాబు చెప్పారట. చంద్రబాబే స్వయంగా సిబిఐ విచారణ అంటూ చెప్పటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.
ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశంపార్టీ బయటకు వచ్చేసినప్పటి నుండి ఇదే విషయం విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇందులో నిజమెంతో తెలీదు కానీ రాజకీయ పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నట్లే కనబడుతోంది.మూడున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పుడపుడు బిజెపి నేతలు విమర్శిస్తునే ఉన్నారు. ఎప్పుడైతే టిడిపి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిందో అప్పటి నుండే చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాజాపా ఫ్లోర్లీడర్ విష్ణుకుమార్ రాజుకూడా పట్టిసీమలో అవినీతి జరిగిందని దీనిపై సీబీఐతో గాని సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలసిందే. ఇప్పుడు సీఎం చంద్రబాబే వ్యాఖ్యలు చేయడంతో పార్టీనేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.