దేశంలో నరేంద్ర మోదీ హవాతో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ చతికిలపడిపోతోంది. ఎట్లున్నది అలాగే ఉంది. కానీ పార్టీ ప్రాతినిధ్యం చట్టసభల్లో ఏమాత్రం మారడం లేదు. నరేంద్ర మోదీ 2014 ఎన్నికల ప్రచారం హైదరాబాద్ నుంచే శంఖారావం పూరించారు. తెలంగాణను నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఆ సమయంలో బీజేపీ సొంతంగా పోటీ చేసి ఉంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం భారీగా పెరిగేది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీతో దోస్తి కొనసాగించడంతో బీజేపీకి చాలా నష్టం చేకూరింది. అయితే బీజేపీతో జత కట్టడం తెలుగు దేశం పార్టీకి చాలా కలిసొచ్చింది. తెలంగాణలో 15 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలుపొందగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏకంగా అధికారంలోకి వచ్చేసింది.
బీజేపీని నమ్ముకొని చంద్రబాబు చాలా లబ్ధి పొందుతున్నాడు. మినహా బీజేపీకి ఒరిగిందేమీ లేదు. చంద్రబాబుతో సన్నిహిత్యం బీజేపీకి ఏనాడు కలిసి రాలేదు. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో పార్టీ ఘన విజయంతో ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల బీజేపీ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి. లేదా మళ్లీ తెలుగుదేశంతో దోస్తీ అంటే కొంపముచ్చినట్టే.
అప్పుడు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లోనే సొంతంగా పోటీ చేసి ఉంటే తీవ్ర పోటీ వచ్చేది. సీట్లు చెప్పుకోదగ్గ రీతిలో వచ్చేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో ఎల్కే అద్వానీ, సుష్మ స్వరాజ్ మద్దతు తెలిపి బిల్లు పాసయ్యేలా చేశారు. ఆ దానిని సద్వినియోగం చేసుకొని ఉంటే ఫలితం ఉండేది. మోదీ తెలంగాణ నుంచే ప్రచారం ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. టీడీపీతో పొత్తు బీజేపీకి కలసిరాలేదు. పైగా నాయకత్వ లేమి బీజేపీని బాధిస్తోంది. దేశ నాయకుల మీదే తెలంగాణ బీజేపీ ఆధారపడింది. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను కూడా బీజేపీ సద్వినియోగం చేసుకోవడం లేదు. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటన క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ఇక ఆంధ్రప్రదేశ్లో
విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఒకటి ప్రకటించాలని 2013 పార్లమెంట్లో తెలంగాణ బిల్లు సందర్భంగా బీజేపీ అగ్ర నాయకులు అద్వానీ, వెంకయ్యనాయుడు, సుష్మస్వరాజ్ కోరారు. ఆ విధంగా ఏపీకి ప్రత్యేక హోదా, వివిధ కంపెనీలు విభజన బిల్లులో చేర్పించారు. రాష్ట్ర విభజనకు బీజేపీ అంగీకరించిన ఏపీ అభివృద్ధికి కావాల్సిన వాటిని కోరడంతో బీజేపీపై ఏపీలో కొంచెం సానుకూల దృక్పథం ఉంది. ఆ సమయంలో బీజేపీ జతకట్టి దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా టీడీపీ బీజేపీని పట్టించుకోవడం లేదు. ఎక్కడా పొత్తు సంప్రదాయం పాటించకుండా పోతోంది. టీడీపీపై అగ్ర నాయకత్వం ఎలాంటి వైఖరి ఉందో కానీ బీజేపీ మాత్రం ఎదగడం లేదు. ఇప్పుడైనా 2014 చేసిన మాదిరి టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీచేస్తే బీజేపీ దాదాపు పాతిక సీట్లయినా పక్కా వచ్చే అవకాశం ఉంది.
మోదీ చరిష్మాను నమ్ముకున్నా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితం సాధించే అవకాశం ఉంది. కేవలం పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఒప్పించగలిగితే బీజేపీ నాయకులకే మంచి అవకాశాలు వస్తాయి. పార్టీ క్యాడర్ పెరిగి వారి జోష్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాకున్నా 2024లోనైనా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేలా అడుగులైనా పడతాయి.