వైఎస్ జగన్ మీద జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, ఐబీపై తీవ్ర అసనం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన తరువాత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పివుంటే, తాను, తనతో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్ దోషులుగా నిలబడివుండేవాళ్లమని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో శుక్రవారం నాడు జరుగుతున్న కలెక్టర్ల కాన్పరెన్స్లో సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్పై జరిగిన దాడి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు.
జగన్ పై కాస్తంత పెద్దదాడి జరిగి, ఆయన విశాఖలోని ఆసుపత్రికి వెళ్లకుండా, హైదరాబాద్ కే బయలుదేరి, ఆ గంటన్నర వ్యవధిలో జరగరానిది జరిగుంటే పరిస్థితి ఎలా ఉండేదని అధికారులను ప్రశ్నించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ పై దాడి జరుగగా, సాయంత్రం 4 గంటల వరకూ పోలీసుల స్పందన సరిగ్గా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.