ఓ సారి గతంలోకి వెళదాం. నవంబర్ 8, 2016 రాత్రి ఉన్నట్టుండి ప్రధాని నరేంద్రమోదీ టీవీ తెరలపై ప్రత్యక్షమై ఈ రోజు నుంచి రూ.500, రూ.1000 నోట్లు చెల్లవు అంటూ ప్రకటన చేసి వెళ్లిపోయారు. మరుసటి రోజే చంద్రబాబు రాష్ట్రంలోని టీవీ తెరలపై కనిపిస్తూ మోదీకి నోట్ల రద్దు సలహా ఇచ్చింది నేనే అంటూ ప్రకటనలు చేశారు.
సీన్ కట్ చేస్తే ఫిబ్రవరి 10, 2019 మధ్యాహ్నం మళ్లీ రాష్ట్ర టీవీ తెరలపై నల్లరంగు చొక్కాలతో కనిపించారు ఏపీ సీఎం చంద్రబాబు. అదే నోట్ల రద్దు చేసిన ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్ చర్య అంటూ విమర్శించారు. చూస్తున్న జనాలకు మాత్రం ఏం అర్థమవడం లేదు. ప్రజలకు మతిమరుపు వచ్చిందనుకున్నారా? లేక చంద్రబాబుకేమైనా మతిమరుపు వ్యాధి వచ్చిందా? ఇవి రెండు కాక తాను ఏదీ చెబితే ఏపీ ప్రజలకు అదే వేదం అనుకుంటున్నారా? అని ప్రశ్నించుకుంటున్నారు సామాన్య ప్రజలు.
ప్రజలంతా ఏటీఎమ్ సెంటర్ల వద్ద గంటల కొద్ది లైన్లలో నిల్చోని నానా కష్టాలు పడుతున్న సమయంలో కూడా చంద్రబాబుకు కనిపించలేదు సరికదా.. ఆ క్రేడిటంతా నాదే అన్నారు. ఇప్పుడేమో నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని సభలో ప్రసంగించారు చంద్రబాబు.
ఇప్పుడున్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడారు? ఈ మధ్య కాలంలో ఏం మారింది? అనే ప్రశ్న వేసుకుంటే… వచ్చే సమాధానాలు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం.. చంద్రబాబుకు మోదీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు రూపొందడం.. వచ్చే ఎన్నికల్లో మోదీ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదనుకుకోవడం ఇలా ఇంకా చాలానే వస్తాయి. ఇందులో ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేవని తెలుస్తోంది. చంద్రబాబు ఏం చేసినా తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప మరింకేం లేదని స్పష్టత వస్తోంది.
అసలు విషయం ఏమిటంటే.. చంద్రబాబుపై మోదీ ఏవో విమర్శలు చేశారు.. వాటిని మరిచిపోవాలంటే చంద్రబాబు మోదీని అంతకంటే గట్టిగా ఇంకేమైనా అనాలి.. అదే అన్ని మీడియాల్లో రావాలి. ఇదే స్ట్రాటజీ తప్ప మరింకేం కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య అయితే.. ఆ సలహా ఇచ్చిన వారినేమంటారో తెలుగు తమ్ముళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈపాటికి.