అందరూ అనుకున్నట్లు గానే కేసీఆర్ త్వరలో దేశరాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. భాజాపా, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆదిశగా కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలోని చిన్న పార్టీలన్నింటిని ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన కొడుకు కేటీఆర్ను వారసుడిగా ప్రకటించారు. 17 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో కేటీఆర్ సేవలను గుర్తించిన కేసీఆర్.. కేటీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు అప్పగించారు. దీంతో తన తర్వాత కేటీఆరే అసలైన వారసుడు అనే స్పష్టమైన సంకేతాలను కేడర్కు పంపారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అందుకే రాష్ట్రంలో పార్టీ పగ్గాలు, బాధ్యతలను తన కొడుక్కి అప్పగించినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం వెనుక కేటీఆర్ కృషి కూడా ఉందని నేతలు చెబుతున్నారు. గెలుపులో కేటీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
2006లో అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చేశారు కేటీఆర్. ఆ తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లోచురుగా పాలుపంచుకున్నారు. దీంతో 2009లో కేసీఆర్ ఆదేశాలతో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి పార్టీలో పట్టు పెంచుకుంటూ వచ్చారు. 2014 ఎన్నికల నాటికే ఆయన పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగారు. 2001 నుంచి పార్టీలో ఉన్న హరీశ్ రావుకు గట్టి పోటీగా వచ్చారు.