గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు రాజకీయాలు కూడా అదే స్థాయిలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటెల అయితే ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులు వర్సెస్ ఈటెల అన్న పరిస్థితి నెలకొంది.
ఇక ఈటెల పై ఎక్కుపెడుతున్న వారిలో మంత్రి గంగుల కమలాకర్ మొదటి వరుసలో ఉన్నారు. ఈటలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఈట రాజేందర్ భూ కబ్జా కేసు విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ రోజు హుజూరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా మంత్రి గంగులపై విరుచుకు పడ్డారు.
తనపై కక్షపూరితంగా వ్యవహరించినా ఫర్వాలేదని, కానీ ప్రజలను మాత్రం వేధించొద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తనకు మద్దతు తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ప్రభుత్వ నిధులు రావాలంటే తమతోనే ఉండాలని హెచ్చరిస్తున్నారని ఈటల ఆరోపించారు. అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్ను బొందల గడ్డగా మర్చినావ్.
నీ పదవీ కేవలం పైరవీ వల్ల వచ్చింది. నీ బెదిరింపులకు భయపడేవాడిని కాదు. నా ప్రజలకు నీ గురించి మొత్తం తెలుసు. నాగార్జునసాగర్లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారు. హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు? అని ఈటల అన్నారు. నీ కథ మొత్తం తనకు తెలుసని… సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని… 2023 తర్వాత నీవు ఉండవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.