త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఒపీనియన్ పోల్స్ కూడా వచ్చేశాయి. మరి కమలం దూసుకెళ్తుందా? హస్తం ఇరగదీస్తుందా? లేక చీరుపు ఊడ్చేస్తుందా అనే చర్చ మొదలైంది.
వచ్చే నెల నుంచి యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని టైమ్స్నౌ ఒపీనియన్ పోల్ చెప్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవాల్లో బిజెపి దుమ్ము రేపుతుందని, పంజాబ్లో మెజారిటీ నియోజకవర్గాలను ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుతో ఊడ్చేస్తుందని చెప్తోంది.
యూపీలో మళ్లీ బీజేపీదే అధికారమంటోంది ఒపీనియన్ పోల్. 403 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి 227నుంచి 254 సీట్లు సాధిస్తుందని చెప్తోంది. అటు ఎస్పీకి 151లోపు, బీఎస్పీకి 14లోపు, కాంగ్రెస్ కు 11 లోపు సీట్లు వస్తాయంటోంది. పంజాబ్ ప్రజలు ఆప్ కి పట్టం కడతారని టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్స్ చెపుతున్నాయి. ఆప్ కి 58వరకు సీట్లు వస్తే, కాంగ్రెస్ 47లోపే ఆగిపోతుందని చెప్తోంది. ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక్కడ బిజెపికి 50 సీట్ల వరకు వస్తే, కాంగ్రెస్ 12నుంచి 15 సీట్లతో సరిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. గోవాలో కూడా కమలే వికసిస్తుందని ఒపీనియన్ పోల్ చెప్తోంది.