సీతక్క ములుగు ఎమ్మెల్యే. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యే . పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వర్గంగా ఆమెకు గుర్తింపుంది. ఆమె టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి కూడా రేవంత్ రెడ్డితోపాటే వచ్చారు. నిన్నటిదాకా పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాల్లో సీతక్క కచ్చితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఆమె హడావిడి పెద్దగా కనిపించటం లేదు. కాంగ్రెస్ పార్టీకి సీతక్క ఎందుకు దూరంగా ఉంటున్నారు? కావాలనే గ్యాప్ తీసుకున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
దళిత, గిరిజన దండోరాకి.. సీతక్కతోనే మొదటి అడుగు వేసింది రేవంత్ బృందం. ఇంద్రవెల్లి సభ వెనుక కూడా సీతక్క కృషి ఉంది. కానీ, ఇప్పుడామె ములుగు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈ మధ్య భట్టివిక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్ జరిగింది. ఆ భేటీకి కూడా సీతక్క రాలేదు. టీఆర్ఎస్లోకి వెళ్లినవారిని తీసేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. వీరిలో ఉండీ లేనట్టుగా కనిపించే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మినహాయిస్తే, మిగిలింది ఐదుగురు. వారిలో సీతక్క కూడా రాకపోవటంతో సమావేశంలో ఉన్నది నలుగురు మాత్రమే.
రేవంత్ టీమ్ లో గుర్తింపున్న నాయకురాలు సీతక్క. సోషల్ మీడియాలో కూడా ఆమె కార్యకలాపాలకు మంచి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడామె ములుగుకే ఎందుకు పరిమితమౌతున్నారనే చర్చ నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల గోల తనకెందుకు అనుకున్నారా? లేక మరేదైనా ప్లాన్ ఉందా అనే ప్రచారం నడుస్తోంది. నిన్నటిదాకా తెలంగాణ అంతా తనదే అన్నట్టున్న మహిళా నేత ఇప్పుడు ములుగు లోకల్ అన్నట్టుగా ఎందుకు మారారో మరి?
అయితే సినిమాలు వాయిదా వేసుకోండి..!