ఆంధ్రప్రదేశ్లో రాజకీయా వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణాలో ఎన్నికలు పూర్తి అవడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీపై పడింది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రానుండటంతో… అన్ని పార్టీలు దాదాపు ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి. మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవడానికి బాబు వ్యూహాలు సిద్దం చేస్తుండగా…ఈసారి అధికారంలోకి రావాలని జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే తాజాగా తెలుగు రాజకీయాల్లో ఒ వార్త హల్చల్ చేస్తోంది. వైసీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేకా ఉండదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో బలమైన టీడీపీని ఢీ కొట్టాలంటే ఎంతటి ప్రజాబలం ఉన్నా సరిపోదన్నది అందరికి తెలిసిందే. పోల్ మేనేజ్మెంట్లో బాబు దిట్ట. ఆయన్ను ఢీకొట్టాలంటే అంతకంటే బలమైన ప్రజల మద్దతు ఉండాల్సిందే. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికను నివారించాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
మరో వైపు జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఉవ్వీల్లూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపార్టీ మధ్య పొత్తు ఉంటుంది …ఎవరెవరు కలిసి ఎవరితో పోరాడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో జనసేన మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత టీడీపీతో విబేధించి పవన్ బయటకు వచ్చారు.
తాజాగా రెండు పార్టీల మధ్య రహస్యంగా చర్చలు తాజాగా మొదలయ్యానన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ, జనసేన ఒకరిమీద బాణాలు సంధించుకుంటున్నారు.వైసీపీ, జనసేన మధ్య పొత్తు ఉండే అవకాశం లేదని బయట ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అంతిమంగా టీడీపీకి లాభం చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో తాజాగా రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయని ప్రచారం సాగుతోంది. సినిమా నటుడు, పవన్ సోదరుడు నాగబాబు, మై హోంస్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ భేటీలో పాలుపంచుకున్నారని అంటున్నారు ఈ సందర్భంగా జనసేనకు 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు కేటాయించే విషయమై అభిప్రాయ సేకరణ కూడా జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇరు పార్టీల నేతలు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.
పొత్తులకు సంబంధించి జగన్, పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా దిగివస్తే మాత్రం ఈ బంధం ఒక్కటి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు ఈ రెండు పార్టీల మధ్యన పొత్తు కుదిరితే మాత్రం టీడీపీకి భారీ షాక్ తగలక తప్పదంటున్నారు విశ్లేషకు. రాయల సీమ జిల్లాల్లో బలమైన శక్తిగా వైసీపీ, కోస్తా జిల్లాల్లో జనసేనకు అంతో ఇంతో ఆదరణ ఉంది.
అయితే ఉప్పు నిప్పులా ఉన్న ఇరు పార్టీల నేతల మధ్య సయోధ్య కుదురుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బద్దశత్రువైన కాంగ్రెస్తో టీడీపీ కలసినప్పుడు లేనిది వైసీపీ, జనసేన కలిస్తే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. రాజాకీయ అవసరాలకోసం వైసీపీ, జనసేన కూడా పట్టు విడుపులకు పోరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తానికి వైసీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే… ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఖాయమనే చెప్పాలి. ఒక వేళ రెండు పార్టీలు కలసి పోటీచేస్తే టీడీపీకీ విజయ ద్వారాలు మూసుకున్నట్లే…? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. భవిష్యత్తులో ఏ జరుగుతుందో వేయిట్ అండ్ సీ..?