ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై విపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తుంటె జనసేన మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక జగన్ను దేవుడితో పోల్చుతూ ప్రశంసించారు. అభివృద్ది, సంక్షేమం రెండింటికి సమానమైన ప్రాధాన్యత చేస్తూ సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. వరప్రసాద్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు వైసీపీ ఎమ్మెల్యేలు బల్లలపై కొడుతూ హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు.
వైఎస్ రాజశేఖరెడ్డితో జగన్ను పొలుస్తూ.. మత్స్యకారుల విషయంలో ప్రస్తానవ వచ్చినప్పుడు జగన్ను దేవుడితో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తకిరంగా మారింది. సీఎం జగన్ వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని అభినందించారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అన్న విధంగా తీసుకు వచ్చింది రాజశేఖరరెడ్డి అని జనసేన ఎమ్మెల్యే గుర్తు చేశారు. సుమారు రూ.28,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను రూపొందించడం గొప్ప విషయమన్నారు.
పంట నష్టపోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని తెలిపారు. కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా ఎమ్మెల్యే వరప్రసాద్ సమర్ధించారు. మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే.. కోరకుండా కోరికలు తీర్చింది జగన్గారు అని మత్స్యకారులు ఆనందిస్తున్నారు. వాళ్లకు పది లక్షలు సాయం చేస్తామనడం సంతోషకరమన్నారు.