రాహుల్ సమక్షంలో నాగం జనార్దన్రెడ్డి చేరిక ఖాయం
తనను పట్టించుకోవడం లేదు.. నా స్థాయికి విలువ ఇవ్వడం లేదని అలక మీద ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో అధిష్టానానికి డెడ్లైన్ ఇచ్చారు. ఉగాదిలోపు తనకు న్యాయం చేయలేకపోతే పార్టీ మారుతానని డెడ్లైన్ ఇచ్చారు. అయితే పార్టీ అధిష్టానం తన డెడ్లైన్ను పట్టించుకోకపోవడంతో ఇక పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉంది. ఆ జిల్లాలో నాగం జనార్దన్రెడ్డి కీలక నాయకుడు. ఇప్పుడు నాగం కాంగ్రెస్లో చేరితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.
నాగం జనార్దన్రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడి వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నాగం లేని లోటు స్పష్టం కనిపించేది. అయితే 2014 ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా తన కుమారుడిని నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానంలో దింపగా కుమారుడు కూడా ఓడిపోయాడు. అయితే అసెంబ్లీకి నాగం పోటీ చేసి ఉంటే కచ్చితంగా గెలిచే వ్యక్తి. కానీ పొరపాటు చేసి నష్టపోయాడు. అయితే ఆ తర్వాత నుంచి బీజేపీ నాగంను పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. గవర్నర్ పదవిపై ఆశ పెట్టుకోగా కేంద్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తాను విధించిన ఉగాది డెడ్లైన్ను బీజేపీ పట్టించుకోకపోవడంతో ఉగాదిలోపే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలుపెట్టింది. దీనికి రాహూల్ వచ్చే అవకాశం ఉండడంతో రాహూల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవలనే ఢిల్లీలో రాహూల్ను నాగం జనార్దన్రెడ్డి కలిశారు. నాగం చేరిక కాంగ్రెస్కు బలం చేకూర్చే అవకాశం ఉంది.
ఆయనతో పాటు కాంగ్రెస్లోకి బీజేపీ, టీ టీడీపీ నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. నిజామాబాద్ నుంచి మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడిన ప్రతాప్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.