దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల చంద్రులిద్దరూ ఆరాటపడుతున్నారు.ఈ విషయంలో కేసీఆర్ కంటే బాబు ఒక మెట్టు పైనే ఉండారనడంలో సందేహంలేదు.ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్తో దోస్తీ కట్టి ఆ కూటమిని జాతీయస్థాయిలో అధికారంలోకి తెస్తానని ధీమాగా అంటున్నారు. మరోవైపు కేసీఆర్.. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను కూడగడతానని దేశం మీదకు బయలుదేరారు.
కాంగ్రెస్, భాజాపాకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కేసీఆర్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్పై చర్చించారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. నవీన్ పట్నాయక్ ను కేసీఆర్ కలిసిన మరుసటి రోజే ఒడిషా ఎంపీ చంద్రబాబుతో భేటీ వెనుక మర్మం ఏంటి …?నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా సౌమ్యా రంజన్ పట్నాయక్ చంద్రబాబు తో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వీరిద్దరూ అనేక అంశాలపై చర్చించినా ప్రధానంగా కూటమి అంశమే కీలకమని వార్తలు వస్తున్నాయి. నవీన్ పట్నాయక్ ఇప్పడు కాంగ్రెస్ కూటమిలో ఉంటారా.. లేక ఫెడరల్ ఫ్రంట్లో ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఇరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. చంద్రబాబు ఆరోపణలకు ఒడిసా సీఎం మద్దతు ప్రకటించారు.
మరోవైపు బీజేపీయేతర ఫ్రంట్ పై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తాము కూడా బీజేపీయేతర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించినట్లు తెలుస్తోంది. అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు చర్చించారు.మరి అదే జరిగితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ఆరంభంలోనే గండిపడ్డట్టవుతుంది.