ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార టీడీపీ పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి నేతల వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నేత టీడీపీ పార్టీకి ఝలక్ ఇచ్చి వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత , ఎమ్మెల్సీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మాగుంట పార్టీలోకి తీసుకురావడంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా మాగుంటను పార్టీలోకి తీసుకురావడానికి విజయసాయి రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇన్నాళ్లకు ఆయన రాయబారం ఫలించింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి, నేడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంట్కు పోటీ చేస్తే, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు ప్లస్ పాయింట్ అవుతుందని పలువురు చెప్పడం కూడా కారణమని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే మాగుంట రాకను అక్కడ మాజీ ఎంపీ ,జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. కాని వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చే బాధ్యతను కూడా విజయసాయి రెడ్డి తీసుకున్నారని సమాచారం. మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీలో చేరడం వెనుక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.