కరుణానిధి అస్తమయం అనంతరం ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన తనయుడు ఎంకే స్టాలిన్. దీంతో డీఎంకేలో నూతన శకం ప్రారంభమైంది. కరుణ మరణం తర్వాత శోకసంద్రంలో మునిగిన పార్టీ కార్యాలయం, మళ్లీ ఈరోజు పండుగ శోభను సంతరించుకుంది.
ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్ష పదవికి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం స్టాలిన్ మాత్రమే ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మరో నామినేషన్ ఏదీ దాఖలు కాలేదు. దీంతో స్టాలిన్ ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని డీఎంకే అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు, పార్టీలో తనను చేర్చుకోవాలని, లేకపోతే తన సత్తా ఏంటో చూపిస్తానని స్టాలిన్ అన్న అళగిరి హెచ్చరిస్తున్నప్పటికీ… పార్టీ నేతలు ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. తనను పార్టీలోకి తీసుకోవాలని లేకపోతే కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో నిలుస్తానని అళగిరి హెచ్చరిస్తున్నారు.పార్టీ సీనియర్ నేత దురైమురుగన్ పార్టీ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు.