నంద్యాల టీడీపీ రాజకీయం మళ్లీ మొదటి కొచ్చింది. ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి పోటీ చేయడంపై మరో సారి చేసిన కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరిగే ఎన్నికల్లో నంద్యాల టికెట్ ఆశిస్తున్నానని తన మనసులోని మాటను బయట పెట్టారు. ఇప్పుడు ఇదే నంద్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డి నంద్యాల టికెట్ను ఆశించడం చర్చనీయామైంది. మరో వైపు అదే టికెట్ కోసం ఎంపీ ఎస్పీవైరెడ్డి అల్లుడుకూడా ఆశిస్తున్నారు. మరో వైపు ఈసారి భూమా కుటుంబంలో ఒకరికే టికెట్ ఇచ్చేదని ఇప్పటికే బాబు సంకేతాలు పంపారు. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల నుంచి గెలిచే అభ్యర్థుల జాబితాను తెప్పించుకున్నారని, గెలిచే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
కర్నూలు రాజకీయాల్లో భూమా, ఏవీ కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డికి ఏవీ మంచి మిత్రుడు.భూమా మరణం తర్వాత అఖిల ప్రియ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి రెండు కుటుంభాల మధ్య దూరం పెరిగింది. మంత్రి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలు విబేధాలు చాలా సార్లు బయటపడ్డాయి. ఇటీవల టీడీపీ సైకిల్ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. భూమా వర్గీయులే దాడి చేశారని సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో రంగంలోకి దిగిన బాబు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇప్పుడు మరో సారి పోటీచేయడంపై ఏవీ చేసిన ప్రకటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.