ఉత్తరాంధ్రలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు) టీడీపీకీ రాజీనామా చేసి వైసీపీలో చేరుతానని ప్రకటించారు. అను కున్నట్లు గానే కన్నబాబు ఆయన కుమారుడు విశాఖ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమారవర్మలు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు.
పెద్ద ఎత్తున తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు.
కన్నబాబురాజు వైఎస్సార్సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చలు జరిపినా సఫలం కాలేదు. తాను వైఎస్సార్సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు.