ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ప్యూ, వారాంతపు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ను రేపటి (మార్చి 24) నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.
అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతి లోపు స్కూళ్లు, గురుకులాలను, వసృతి గృహాలను వెంటనే మూసివేస్తే మేలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. వైద్య కళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.
స్కూళ్లలో బోధనా,బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కాబట్టి.. కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణా తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రకటనకు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై స్కూళ్ల మూసివేత అంశంపై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రేపటి నుంచి స్కూళ్లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు