అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల, వైసీపీ సమన్వయకర్త జొన్నల గడ్డ పద్మావతి మధ్య సవాల్లు, ప్రతిసవాల్లతో రాజకీయం మరింత వేడెక్కింది.పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గత నాలుగేళ్ల పాలన, టీడీపీ నేతల అవినీతిపై వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాలతో చర్చించేందుకు నార్పల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జొన్నలగడ్డ పద్మావతిని ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతలు చర్చకు రాకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని పారిపోయారని ఈ సందర్భంగా జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు.
పద్మావతి అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన నిర్వహించారు. మరోవైపు పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, అందుకే టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు.